
ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే ఈమెయిల్ సేవల్లో ఒకటైన జీమెయిల్పై ఇటీవల వచ్చిన హ్యాకింగ్ వార్తలకు గూగుల్ స్పందించింది. మీడియాలో చక్కర్లు కొడుతున్న “జీమెయిల్ డేటా లీక్” సమాచారం పూర్తిగా తప్పు అని గూగుల్ అధికారికంగా తెలిపింది.
అదే సమయంలో, వినియోగదారుల కోసం కొత్త AI ఆధారిత ఫీచర్లను కూడా గూగుల్ విడుదల చేసింది.
గత వారం కొన్ని వెబ్సైట్లలో సుమారు 18.3 కోట్ల ఈమెయిల్ అకౌంట్ వివరాలు లీక్ అయ్యాయని వార్తలు వచ్చాయి. దీనిపై గూగుల్ ఎం చెప్పింది అంటే “ఇది జీమెయిల్ సర్వర్ నుంచి లీక్ అయిన సమాచారం కాదు. పాత ‘ఇన్ఫోస్టీలర్’ హ్యాకింగ్ లాగ్స్ నుండి సేకరించిన డేటా ఇది. జీమెయిల్ సిస్టమ్స్ పూర్తిగా సురక్షితంగా ఉన్నాయి” అని తెలిపింది.
అదే సమయంలో, జీమెయిల్లో కొత్త AI ఫీచర్లు కూడా ప్రవేశపెట్టింది. Workspace వినియోగదారుల కోసం “Help Me Schedule” అనే కొత్త టూల్ను జోడించింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఈమెయిల్ రాస్తున్నప్పుడు సమావేశ సమయాలను AI స్వయంగా సూచిస్తుంది. క్యాలెండర్లోని ఖాళీ సమయాలను గుర్తించి, ఆ వివరాలను మెయిల్లో జోడిస్తుంది. ఇది పనితీరును వేగవంతం చేస్తుందని గూగుల్ తెలిపింది.
అలాగే, మొబైల్ వినియోగదారుల కోసం కొన్ని సౌకర్యాలను కూడా అప్డేట్ చేసింది. ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పుడు నోటిఫికేషన్లో నుంచే మెయిల్ను “read” చేయగలరు. iOS యూజర్లకు నోటిఫికేషన్లో సెన్డర్ ఫోటో కూడా కనిపిస్తుంది, తద్వారా ముఖ్యమైన మెయిల్స్ను తక్షణమే గుర్తించవచ్చు.
భద్రత పరంగా గూగుల్ వినియోగదారులకు కొన్ని సూచనలు చేసింది రెండు దశల ధృవీకరణ (2-Step Verification) తప్పనిసరిగా ఆన్ చేయాలని, SMS ఆధారిత OTPలకు బదులుగా Passkeys ఉపయోగించమని సలహా ఇచ్చింది. ఇది SIM swapping వంటి మోసాల నుండి రక్షణ కల్పిస్తుందని పేర్కొంది.
గూగుల్ ప్రతినిధుల ప్రకారం, “జీమెయిల్లో ఎటువంటి హ్యాకింగ్ జరగలేదు. కానీ వినియోగదారులు తమ అకౌంట్లను భద్రపరచుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి” అని తెలిపారు.
వినియోగదారులకు సూచన: మీ జీమెయిల్ అకౌంట్లో పాస్వర్డ్ను మార్చండి, రికవరీ ఈమెయిల్ అప్డేట్ చేయండి, 2FA ఆన్ చేసుకోండి, మరియు యాప్ తాజా వెర్షన్లో ఉందో లేదో తనిఖీ చేయండి. గూగుల్ కొత్త AI ఫీచర్లతో జీమెయిల్ మరింత స్మార్ట్గా మారుతోంది కానీ భద్రత మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి.
